-->

విలియం కేరి జీవిత చరిత్ర | William Carey Life Story ( Short)

ఫాదర్ ఆఫ్ మోడ్రెన్ మిషన్స్

జననం:

       విలియం కేరి ఇంగ్లాండ్ లోని నార్త్ యాంస్టన్ షైర్ సమీపంలో గల 'పాలెర్సు పురి' అనే గ్రామంలో ఎడ్మండ్, ఎలిజబెత్ అను తల్లిదండ్రులకు  1761 ఆగస్టు 17 న జన్మించారు.  18 సంవత్సరాల వయసులో రక్షణనుభవంలోకి వచ్చారు.

ఆత్మల కొరకైన భారం

ప్రపంచ సువార్తీకరణ పట్ల, తన చర్చి పట్టనట్టుగా ఉండటాన్ని సహించలేని కేరీ, 1790లో ఒక ఆందోళనచేపట్టాడు. లోకమంతటా సువార్త ప్రకటింపబడాలని ప్రార్ధిస్తూ కూర్చుంటే సరిపోదని కేరీ వాదించాడు. ఏదో ఒకటి చేయాలని, ఒక విధి విధానాన్ని అవలంబించాలని చెబుతూ వచ్చాడు. 1792లో 'An Enquiry into the Obligations of Christians to Use Means for the Conversion of the Heathens' అనే పేరుతో ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించాడు. దేవుని మహిమాయుత ప్రణాళిక నెరవేరడానికి మనమూ ఆయనతో చేతులుకలపాలనే భావాన్ని అందులో వ్యక్తం చేసాడు. "ఆంగ్లభాషలో మిషనరీ పరిచర్యకు సంబంధించిన పరిశోధనాత్మక వ్యాసాల్లో ఒక రకంగా అదే మొదటిది, అలాగే నేటికీ అదే గొప్పది" అని కేరీ జీవితచరిత్ర రాసిన జార్జ్ స్మిత్ పేర్కొన్నాడు. ఆ వ్యాసానికి అనుసంధానంగా, నాటింగ్ హామ్ లో,బాప్టిస్ట్ సేవకుల సమావేశంలో కేరీ చేసిన ప్రసంగం అక్షరాలా చారిత్రాత్మకమయ్యింది.

        నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము, నీ మేకులను దిగగొట్టుము.  కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. (యెషయా 54:2‭-‬3)

        అంటూ యెషయా 54 ఆధారంగా కేరీ చేసిన ప్రసంగం ఒక కొత్త మిషనరీ శకానికి నాంది పలికింది. 'గొప్ప వాటినిదేవుని నుండి ఆశించండి, గొప్పవాటిని దేవుని కోసం చేపట్టండి' అంటూ కేరీ ఎలుగెత్తి చాటాడు. పర్యవసానంగా కెటరింగ్ అనే ఒక చిన్న పట్టణంలో మరో సమావేశం జరిగింది. ప్రపంచ సువార్తీకరణ కోసం ఒక మిషనరీ సొసైటీ ఏర్పడింది. అప్పుడు వాళ్ళ వద్ద ఉన్నది... పదమూడు పౌండ్ల చిల్లర!

ఇండియాకు మిషనరిగా

               నిజానికి విలియం, జాన్ థామస్ అనే ఇద్దరిని ఇండియాకు మిషనరీలుగా పంపాలని సొసైటీ మొదట నిర్ణయించింది. అయితే, దీనికి సంబంధించి లండన్ లో జరిగిన సమావేశం చివర్లో, స్థానిక భారతీయ భాషల్లోకి బైబిల్ని అనువాదం చేయాలన్న తన కోరికను కేరీ వెల్లడించాడు. ఆ సమావేశానికి హాజరైన విలియం వార్డ్ అనే ఒక ప్రింటర్, కేరీని కలిసి ఇండియాకు రమ్మని ప్రోత్సహించాడు. విచిత్రమేమిటంటే, కేరీ అచ్చమైన కాల్వినిస్టు! కాల్వినిస్టులు ప్రిడెస్టినేషన్ అంటూ సువార్త పనిని అలక్ష్యం చేస్తారనే అభిప్రాయానికి భిన్నంగా కేరీ మిషనరీ పరిచర్య పట్ల తీవ్రమైన శ్రద్ధా, బాధ్యతా, భారాన్నీ ప్రదర్శించాడు. మిషనరీ పని చేయాలని వ్యాసాలు రాయటం, ప్రసంగాలు చేయటంతో కేరీ ఊరుకోలేదు. 1793 జూన్ 13న తన కుటుంబంతో సహా ఇండియాకు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం!

ఇండియాలో అడుగుపెట్టుట

         భారత దేశంలో అడుగుపెట్టాక కేరీకి ఎదురైన వ్యతిరేకత అసాధారణమైంది. బ్రిటీషు పార్లమెంటు, ఈస్ట్ ఇండియా కంపెనీ, మిలటరీ, ప్రాచ్య పండితులు అందరూ తనకు వ్యతిరేకమే. విచిత్రంగా తనను పంపిన సొసైటీ బోర్డ్ వారినుంచీ, తను ఏ ప్రజలకు సేవ చేయాలని వచ్చాడో ఆ ప్రజల నుంచీ కూడా వ్యతిరేకత ఎదురవ్వటం శోచనీయ. మిషనరీలు అనగానే పాశ్చాత్య దేశాల సంస్కృతిని వ్యాప్తి చేస్తారనీ, స్థానిక సంస్కృతిని హరించివేస్తారనీ సహజంగా అనుకుంటూ ఉంటారు. అయితే కేరీ మిషనరీ పరిచర్యను పరిశీలించిన ఎవరైనా ఆ అభిప్రాయం తప్పు అని ఒప్పుకుని తీరతారు. 

     
       భారత దేశంలోని స్థానిక సంస్కృతీ, స్థానిక భాషల పరిరక్షణ కోసం కేరీ చేసినంత కృషి, అంతకు మునుపు కానీ, ఆ తర్వాత కానీ, మరే భారతీయుడూ చేయలేదనేది నిర్వివాదాంశం. విలియంకేరీని కేవలం మిషనరీ అంటే సరిపోదు. నేటి క్రైస్తవ ప్రపంచం కీర్తిస్తున్నట్లుగా 'ఆధునిక ప్రేషితోద్యమపితామహుడు' అనే బిరుదు కూడా ఆయనకు చాలదు. సామాజికంగా ఎదురయ్యే వ్యతిరేకతలు, మతిస్థిమితం లేని భార్య, తరచూ అనారోగ్యపాలయ్యే పిల్లలు, నిత్యం వెంటాడే ఆర్ధిక ఇబ్బందులు...వీటన్నిటి నడుమ కేరీ ఏమి చేసాడో, ఎంత సాధించాడో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాము. ఒక సగటు మిషనరీ తన జీవితకాలంలో ఇన్ని పనులు ఎలా చేయగలిగాడు అనేది ప్రపంచవ్యాప్త మిషనరీలందరికీ, ఎప్పటికీ ఒక పెద్ద సవాలుగానే ఉంటుంది.

కేరి వృక్షశాస్త్రజ్ఞుడు

        'ఇంగ్లీష్ డెయ్ జీ' అనే పూలమొక్కను ఇండియాకు తెచ్చింది కేరీయే. తోటపనిలో లినీయన్ (Linnaean) విధానాన్ని భారతదేశానికి పరిచయం చేసాడు. విలియం రాక్స్ బర్గ్ రాసిన బోటనీ ప్రామాణిక గ్రంధం 'ఫ్లోరికా ఇండికా'కు సంపాదకుడు కేరీయే. 'హోర్టాస్ బెంగాలెనిస్' వంటి ఇతర సైన్సు పుస్తకాల్ని కూడా ముద్రించాడు. బోటనీలో కేరీ కృషిని గుర్తిస్తూ ఒక మొక్కకు Careya herbacea అని ఆయన పేరునే పెట్టారు. ఈ సృష్టంతా ఒక మాయో మిథ్యో కాదనీ, ఇది వాస్తవమని, దేవుని చేతి పననీ, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలనీ ప్రజలకు తెలియ చేయటం కోసం తరచూ సైన్స్ అవగాహనా సదస్సుల్లో మాట్లాడుతుండేవాడు.

కేరి సువార్తీకరణ విధానంలో మూడు భాగాలు.

1. సువార్త ప్రకటన 

2. బైబిల్ అనువాదం

3. స్కూళ్ళ స్థాపన. 

             దాదాపు మూడు వేలసంవత్సరాలుగా భారతీయుల్ని మూఢ నమ్మకాల చీకటిలోనే ఉంచేసిన దుస్థితినీ, విద్య జ్ఞానం అనేవి అగ్రవర్ణాల వారికి మాత్రమే పరిమితం చేసిన మతసంస్కృతిని కేరీ సహించలేకపోయాడు. నాటి వర్ణవ్యవస్థకు చెంపపెట్టుగా, అన్ని కులాల పిల్లలు కలిసి చదువుకునేందుకు వీలుగా, తన మిత్రులతో కలిసి సిరంపూర్ కాలేజ్ ను స్థాపించాడు.ఆసియాలోనే తొలి డిగ్రీ కాలేజ్ గా అది సుప్రసిద్ధం. ఆ తర్వాతి ఇరవై ఏళ్ళలో సిరంపూర్ మిషనరీలు 103స్కూళ్ళను తెరిచారు (దాదాపు 7000 విద్యార్ధులు... అదీ, ఆ రోజుల్లో!).

             'ఇంగ్లాండ్ లో రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ స్థాపించడగానికి 30 సంవత్సరాలకు ముందే, అంటే 1823లో 'అగ్రి-హార్టికల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా' స్థాపించడు. భారతదేశంలోని వ్యవసాయం గురించి ఒక క్రమబద్ధమైన రీసర్చ్ చేసి, వ్యవసాయంలో సంస్కరణలు తేవడం కోసం తరచూ 'ఏషియాటిక్రీసర్చేస్' అనే జర్నల్ కి వ్యాసాలు అందించాడు. దాదాపు 60 శాతం అరణ్యంలా మిగిలి ఉన్న దేశాన్నిసుభిక్షంగా, సాగు నేలగా చేయటమే కేరీ ఉద్దేశ్యం.

కేరి అటవీ పరిరక్షకుడు

భారత దేశంలో అటవీ పరిరక్షణ పై రచనలు చేసిన మొట్టమొదటి వ్యక్తి కేరీనే. భారత ప్రభుత్వం మొట్టమొదటి సారిగా మలబార్ లో అటవీ సంరక్షణ చర్యలు చేపట్టడానికి సుమారు 50 ఏళ్ళకు ముందే, కేరీ అటవీ సంరక్షణపై వ్యాసాలు రాసాడు. తన పత్రిక 'ఫ్రెండ్ ఆఫ్ ఇండియా'లో రాసిన వ్యాసాలకు స్పందించే, ప్రభుత్వం బర్మా అడవులకు డా. బ్రాండిస్ ను, దక్షిణ భారత అడవులకు డా. క్లేఘమ్ ను సంరక్షణ పర్యవేక్షకులుగా నియమించింది.

  • భారతదేశానికి స్టీమ్ ఇంజన్ ని మొదటిగా పరిచయం చేసింది కూడా కేరీనే. దాన్ని నమూనాగా తీసుకుని స్థానిక పరికరాలు, వస్తు సామాగ్రితో దేశీ స్టీమ్ ఇంజన్ తయారు చేయమని స్థానిక కమ్మరి వారిని ప్రోత్సహించాడు.
  • ప్రచురణ పరిశ్రమల కోసం, దేశీయంగా పేపర్ ని ఉత్పత్తి చేసిన మొదటి వ్యక్తి ఆయనే. అన్యాయంగా దోచుకునే అధిక వడ్డీ విధానం వాక్యానుసారం కాదని గుర్తెరిగి దాన్ని ఎదుర్కొనేందుకు 'సేవింగ్స్ బ్యాంకు' ఆలోచనను ఇండియాకు పరిచయం చేసాడు.
  • కేరీ రాక ముందు వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల్ని సజీవదహనం చేసేవారు. కుష్టువ్యాధి గలవారిని యేసు ప్రేమించాడు,ముట్టుకుని స్వస్థపరిచాడు. కాబట్టి వారిని మనమూ ప్రేమగా చూడాలని, లెప్రసీ రోగుల వైద్యం కోసం దేశంలో ఉద్యమించిన మొదటి వ్యక్తీ కేరీనే.
  • భారతదేశపు ప్రింట్ టెక్నాలజీకి పితామహుడు కేరీనే. ఆధునిక ప్రింటింగ్ ని, పబ్లిషింగ్ ని ఇండియాకుతెచ్చింది, నేర్పిందీ, అభివృద్ధి చేసిందీ ఆయనే.ఇండియాలోనే అతి పెద్ద సిరంపూర్ మిషన్ ప్రెస్ 1800లో స్థాపించాడు. ప్రింటర్లందరూ తమ ఫాంట్లను సిరంపూర్ మిషన్ ప్రెస్ లోనే కొనుక్కునేవారు.
  • సిరంపూర్ మిషన్ ప్రెస్ లో 1800-1832 కాలంలో 212000 పుస్తకాలు ప్రింటయ్యాయంటే మీరు నమ్మగలరా?
  • బెంగాలీలో మొదటి గద్య పుస్తకాన్ని కేరీనే ప్రచురించాడు. సంస్కృతంలో మొదట అచ్చువేయబడిన గ్రంధం 'హితోపదేశం' కేరీ వల్లనే సాధ్యమైంది. తన సహచరుడు మార్షల్ తో కలిసి సంస్కృత రామాయణాన్ని, ఆంగ్లంలోకి అనువదించి, ముద్రించారు.
  • 1818లో వెలువడిన మొదటి ప్రాంతీయ వార్తా పత్రిక 'సమాచార్ దర్పణ్' కేరీ చలవే.
  • ప్రజా ప్రతినిధులు, నాయకుల నాడిని తెలుసుకునేందుకు బెంగాలీలో 'దిగ్దర్శన్' అనే మాసపత్రికను ప్రచురించటం జరిగింది. ఆ రోజుల్లో అదొక సంచలనం.
  • ఆయన ప్రచురించిన ఆంగ్ల పత్రిక 'ఫ్రెండ్ ఆఫ్ ఇండియా' 19వ శతాబ్దం ప్రథమార్ధంలో ఇండియాలో రగులుకున్న సామాజిక చైతన్యానికి మూలాధారమైంది.

కేరి మంచి భాషావేత్త

      కేరి మంచి భాషావేత్త అని చెప్పనవసరం లేదు. మరాఠా, పంజాబీ, తెలుగు, బెంగాలీ భాషల్లో వ్యాకరణ పుస్తకాలు రాసాడు. ప్రత్యేకంగా బెంగాలీభాషను ఉద్ధరించాడు. దేశంలోనే చక్కని సాహిత్యభాషగా దాన్ని తయారు చేసాడు. 'బంగ్లా అంగ్రేజీ అభిదాన్' అనే బెంగాలీ - ఇంగ్లీష్ డిక్షనరీని కూడా అందించాడు. బెంగాలీలో క్రైస్తవ భక్తి గీతాలు కూడా కేరీనే రచించాడు. కన్నడ, ఒరిస్సా, కాశ్మీరీ, నేపాలీ,గుజరాతీ, అస్సామీ భాషల్లోనూ వ్యాకరణ పుస్తకాలు తేవడానికి కృషి చేసాడు.

         "బెంగాలీ భాష పునరుజ్జీవమూ, అభివృద్ధి కోసం ఎంతైతే కృషి జరిగిందో, అదంతా కేరీ, ఆయన సహచరుల వల్లనే జరిగిందని ఒప్పుకోకతప్పదు" అని రవీంద్రనాథ్ టాగూర్ స్వయంగా చెప్పటంలో ఆశ్చర్యం లేదు. బెంగాలీ భాషకు కేరీ చేసిన సేవల్ని గుర్తించి, 1801లో ఫోర్ట్ విలియం కాలేజ్ ఆయన్ని బెంగాలీ ప్రొఫెసర్ గా నియమించింది. బెంగాలీ తో పాటు ఆయన మరాఠీ, సంస్కృత భాషల్నీ బోధించాడు.

కేరి గొప్ప లెక్సికోగ్రాఫర్(నిఘంటుకారుడు).

     పండితుల కోసం తొలి సంస్కృత నిఘంటువు రాసి, ప్రచురించాడు. మరాఠీ, బెంగాలీ, భూటాన్ భాషల్లో కూడా నిఘంటువులు చేసాడు.

 కేరి మహా గొప్ప సంస్కర్త

        కేరీ ఇండియాలో అడుగుపెట్టే నాటికి దేశం పరిస్థితి అతి దుర్భరంగా ఉంది. ప్రపంచంలోనే అతి దారుణమైన మూఢాచారాలు ఇక్కడున్నాయి. బహుభార్యత్వం, (ఆడ శిశు హత్యలు, బాల్య వివాహాలు,సతీసహగమనం, ఆడపిల్లలకి చదువు లేకుండాచేయటం మొదలైనవి. విడ్డూరమేమంటే, వీటన్నిటికీ హైందవ మతం వత్తాసు పలకటం. ఈ దురాచారాలను రూపు మాపేందుకు హైందవ సామాజిక అంశాల్నీ, ఆధ్యాత్మిక గ్రంధాల్ని ఒక క్రమబద్ధంగా అధ్యయనం చేసి, రచనలు చేసి, ప్రచురించాడు. సామాన్య ప్రజలు నుంచి ప్రభుత్వ అధికారుల వరకు, ఇటు బెంగాల్ మొదలుకుని, అటు ఇంగ్లాండ్ వరకు చైతన్యం కలిగించాడు. 'సతి'ని అరికట్టడానికి పాతికేళ్ళపాటు అవిశ్రాంత పోరాటమే చేసాడు. బాలికల కోసం స్కూళ్ళను తెరిచాడు. విధవలు క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పుడు, వారికి పెళ్ళిళ్ళలు జరిపించాడు. ఈ విషయంలో రాజా రామ్మోహన రాయ్, కేశవ్ చంద్ర సేన్ వంటివారికి స్ఫూర్తి విలియం కేరీనే కదా!

బైబిల్ అనువాదకుడు

        తను ఎన్ని రకాల వ్యవహారాలూ, సంస్కరణలూ, సమస్యల్లో తలమునకలవుతున్నా కేరీ తన అసలు పని - దేవుని వాక్యాన్ని స్థానిక భాషల్లోకి అనువదించే పనిని ఎన్నడూ అలక్ష్యం చేయలేదు. బెంగాలీ, ఒరియా, మరాటీ, హిందీ, అస్సామీ, సంస్కృతం భాషల్లోకి బైబిల్ ను స్వయంగా అనువదించాడు. పూర్తిగానో, పాక్షికంగానో, అనువాదమో, ప్రచురణమో,సంపాద కత్వమో ఏ విధంగానైనా కానీ దాదాపు నలభై భాషల్లోకి బైబిల్ రావడం వెనుక కేరీ అవిశ్రాంత కృషి ఉంది. కేరీ చేసిన తెలుగు బైబిల్ అనువాదం సిరంపూర్ ప్రెస్ అగ్ని ప్రమాదంలో కాలిపోవటం దురదృష్టకరం.

       ఇన్ని అసాధారణ విజయాలు సాధించిన కేరీ తన పన్నెండవ యేటనే స్కూలుకు స్వస్తి చెప్పాడంటే నమ్మగలమా? ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఈ దేశాన్ని సమూలంగా ఆధునీకరించడం ఎలా సాధ్యమైంది?

 'కేరి నాకు ఎటువంటి వాడంటే, అతడు నాకు బిషప్, ఆర్చ్ బిషప్ కంటే గొప్పవాడు, అతడు అపోస్తలుడు' అని ప్రసిద్ధదైవ సేవకుడు జాన్ న్యూటన్ అన్నాడంటే కేరీ గొప్పతనాన్ని మనం ఊహించుకోవచ్చు.

      ఇంతకీ కేరి ఎవరు? కేరిని ఏమని  సంబోధించాలి? మిషనరీయా? సువార్తికుడా? సంస్కర్తా? పండితుడా?బహుముఖ ప్రజ్ఞాశాలా? ఏ టైటిల్ ఆయనకు సరిపోతుంది?

విలియం కేరి గారి జీవితంలోని కొన్ని సంఘటనలు

       విలియం కెరీ గారి జీవితము అసాధారణ చరిత్ర. ఆయన భక్తి, విశ్వాసము, సువార్త పరిచర్య, ప్రార్ధన జీవితము, బైబిల్ పరిశోధన, భాషల పరిజ్ఞానము మన ఊహలకందదు. సువార్త ప్రచురణ యందలి విశేషాసక్తి మనకు కనువిప్పు కలిగిస్తుంది. "ఫాదర్ ఆఫ్ మోడ్రెన్ మిషన్స్" అని పేరుగాంచిన విలియం కెరీ, తన పరిచర్యను పరిమళింప చేసాడు. మత సంస్కర్తగా, సంస్కృత భాషా పండితుడుగా, బెంగాలీ భాషా పండితుడుగా కళాశాలలో సాటిలేని పాండిత్యము సంపాదించుకొన్నాడు. అన్నిటికంటే తాను నమ్మిన యేసు క్రీస్తును గూర్చి తాను నివసిస్తున్న జనుల మధ్య ప్రకటించాడు. అందుకే ఆయన జీవితములో "గడ్డి ఎండును, పువ్వు రాలును అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును" అను వాక్యము నెరవేరింది.

            విలియం కేరి భారత దేశంలో 40 సంవత్సరాలు ఘనమైన సేవ చేసాడు. తన జీవిత కాలములో 750 మంది యేసు క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించారు. తన జీవితములో విజయ వీరుడుగా తీర్చ బడ్డాడు. ఆయన సాధించిన కార్యాలు ఎన్నో ఉన్నాయి.

1) బైబిల్ అంతటిని 40 భాషల్లో తర్జుమా చేసాడు. 
2) 1800-1818 : బెంగాళీ భాషలోనికి బైబిల్ ను ముద్రించాడు.
3) ముద్రణ యంత్రాన్ని, కాగితపు పరిశ్రమను స్వంతంగా తయారు చేసాడు.
4) మొదటి ప్రాథమిక పాఠశాలను స్థాపించాడు.
5) హిందూ స్త్రీలకు, బాలికలకు విద్యా సంస్థలు నెలకొల్పాడు.
6) వైద్య పరిచర్య ప్రారంభించాడు.
7) క్రైస్తవులు వేదాంత విద్య అభ్యసించుట కొరకు వేదాంత కళాశాలలను స్థాపించాడు.
8 ) 30 క్రైస్తవ మిషన్ స్టేషన్లు రూపొందించాడు. 
9) వ్యవసాయ రంగము నిమిత్తము నూతన పద్ధతులు రూపొందించాడు. 
10) సంస్కృతంలో నున్న ఇతిహాసములను ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేసాడు.
11) రామాయణ, మహాభారతములను ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేసాడు. 
12) బైబిల్ ను సంస్కృతంలోనికి తర్జుమా చేసాడు.
13) 1800 సం.లో మొదటి విశ్వాసికి బాప్తీస్మం యిచ్చాడు.
14) సతీసహగమనం రూపు మాపుటకు నాటి సంస్కర్తలతో కలిసి కృషి చేసి, మాన్పించాడు. (1767-1827 వరకు 70,000 వితంతువులు అగ్నికి ఆహుతి అయ్యి బుగ్గి పాలయ్యారు)
15) దేవాలయ వ్యభిచార వృత్తిని అదుపులోనికి తెచ్చారు.

విలియం కేరి గారి జీవితములోని కొన్ని ఘట్టాలు 

జననం : ఆగస్ట్ 17, 1761
బాప్తిసం : అక్టోబర్ 5, 1783 
సువార్త సేవకు ప్రయాణము : జూన్ 13, 1793 కలకత్తాలో చేరుట : నవంబర్ 11, 1793
బైబిల్ బెంగాలీ భాషలోనికి తర్జుమా :1800 సిరంపూర్ కళాశాల స్థాపన :1821 
సతీసహగమనం రద్దు :డిసెంబర్ 4, 1829 
ప్రభువు సన్నిధికి చేరుట : జూన్ 9, 1834
మొదటి విశ్వాసి బాప్తీస్మం : డిసెంబర్ 28, 1800 బైబిల్ తర్జుమా : 1818


"దేవుని నుండి గొప్ప కార్యాలు కనిపెట్టుము దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టుము"